గీత నా కూతురే, డీఎన్ఏ టెస్ట్కు సిద్దం: పెద్దపల్లి కలెక్టర్ కు స్వామి వినతి
పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన గీత తన కూతురేనని పెద్దపల్లికి చెందిన స్వామి అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
పెద్దపల్లి: పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన గీత తన కూతురేనని పెద్దపల్లికి చెందిన స్వామి అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ నెల 13వ తేదీన నిర్మల్ జిల్లా బాసరకు వచ్చింది. దీంతో చిన్నతనంలో తమ ఇంటి నుండి తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రులు గీత తమ కూతురే అని మీడియా ముందుకు వస్తున్నారు.
గీత తమ కూతురేనని మహబూబాబాద్ జిల్లాకు చెందిన శాంత, యాకయ్య దంపతులు మీడియా ముందుకు వచ్చిన తర్వాత పెద్దపల్లికి చెందిన స్వామి జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చాడు.
also read:గీత మా కూతురే: యాకయ్య, శాంత దంపతులు
8 ఏళ్ల వయస్సులోనే తమ కూతురు ఇంటి నుండి పారిపోయిందని స్వామి చెప్పారు. చిన్నతనంలోనే తన కూతురు దీపం వెలిగించిన సమయంలో గుడిసెకు నిప్పు అంటుకొందన్నారు. దీంతో తనను తల్లి తిడుతోందనే ఉద్దేశ్యంతో ఇంటి నుండి వెళ్లిపోయిందని స్వామి చెప్పారు.
తన కూతురి కోసం చిన్నప్పటి నుండే వెతుకుతున్నా ఆమె ఆచూకీ లభ్యం లేదన్నారు. కూతురి కోసం వెతికి వెతికి తన భార్య కూడ తన భార్య కూడ చనిపోయిందని ఆయన కలెక్టర్ కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
బాసరకు వచ్చిన గీతను చూస్తే తన కూతురి లక్షణాలు కన్పిస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో తాను డీఎన్ఏ పరీక్ష చేసుకొనేందుకు కూడ సిద్దంగా ఉన్నట్టుగా ఆయన ప్రకటించారు.
గీత చిన్నతనంలోనే రైలులో పాకిస్తాన్ కు వెళ్లిపోయింది. అప్పటి నుండే పాకిస్తాన్ లోనే ఉంది. సుష్మాస్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ నుండి ఆమెను ఇండియాకు రప్పించారు. గీత ప్రస్తుతం ఇండోర్ లోని ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహిస్తున్న హోమ్ లో ఉంటుంది.