నార్సింగిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి..
హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తన ఫ్లాట్ లోనే విగతజీవిగా కనిపించాడు.
హైదరాబాద్ : హైదరాబాదులోని నార్సింగి లో అనుమానాస్పద స్థితిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఫ్లాట్లోని బెడ్రూంలో చనిపోయిన ఘటన మణికొండ అల్కాపూర్ కాలనీలో కలకలం రేపింది. నార్సింగి ఎస్సై సమరంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గన్నవరం మండలం, నున్న గ్రామానికి చెందిన వర్జరక పూర్ణ సాయి సందీప్(22), అతని బంధువు యెర్కరెడ్డి భార్గవ్ రెడ్డి (31), మరో వ్యక్తి జశ్వంత్ తో కలిసి పుప్పాలగూడ అల్కాపూర్ లోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.
భార్గవ్ రెడ్డి icici లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. సాయి సందీప్, జశ్వంత్ ఇటీవల ఊరెళ్లారు. మంగళవారం వచ్చిన సంధీప్ ఫ్లాట్ తలుపు ఎంతసేపు తట్టినా bhargava reddy తీయలేదు. దీంతో వాచ్మెన్ సహాయంతో వంటగది చిమ్నీలో నుంచి లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన వారికి పడకగదిలో నేలపై భార్గవ్ రెడ్డి మృతి చెంది ఉండడం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్గవరెడ్డి ఎలా చనిపోయాడు.. అది హత్యా, ఆత్మహత్యా.. ఎందుకు చనిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.