రైతును చితకబాదిన ఎస్సైపై వేటు... ఎస్పీ భాస్కరన్ ఆదేశాలు
అన్నదాతపై జులుం ప్రదర్శించిన ఓ ఎస్సైపై వేటు పడింది.
సూర్యాపేట: అన్నదాతపై జులుం ప్రదర్శించిన ఓ ఎస్సైపై వేటు పడింది. ఓ రైతును పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని ఇష్టం వచ్చినట్లు చితకబాదినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ ఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ లో లింగం ఎస్సైగా పనిచేస్తున్నారు. అయితే ఏ తప్పూ చేయకున్నా ఇటీవల ఓ రైతును పోలీస్ స్టేషన్ కు పిలిపించిన ఎస్సై చితకబాదాడట. దీంతో బాధితుడు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్సై నిజంగానే అతడిని కొట్టినట్లు నిర్దారించారు.
read more టెక్కీ ఆత్మహత్య: గొడవలన్నీ పక్కనబెట్టి.. అల్లుడితోనే కూతురికి అంత్యక్రియలు
దీంతో ఎస్సై లింగంపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సదరు ఎస్సైని వీఆర్కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ భాస్కరన్ ఉత్తర్వులు జారీ చేశారు. అతడి స్థానంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై హరికృష్ణకు నాగారం బాధ్యతలు అప్పగించారు.