Etela Rajender: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల్లో రెండో రోజు కొనసాగుతున్న సర్వే..
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు(Etela rajender) జమునా హేచరీస్ (jamuna hatcheries) భూముల రీ సర్వే రెండో రోజు కొనసాగుతుంది. నేడు అచ్చంపేటలోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నెంబర్లలో భూసర్వే జరుగుతుంది.
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు(Etela rajender) జమునా హేచరీస్ (jamuna hatcheries) భూముల రీ సర్వే రెండో రోజు కొనసాగుతుంది. మెదక్ జిల్లా (Medak district ) మూసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో దళితులు, పేదలకు చెందిన అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారనే కొందరు రైతులు సీఎం కేసీఆర్కు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే గతంలో అక్కడ ప్రాథమిక సర్వే నిర్వహించారు. 66.01 ఎకరాలు అసైన్డ్, సీలింగ్ పట్టా భూములు జమునా హెచరీస్ ఆధీనంలో ఉన్నట్టుగా జిల్లా కలెక్టర్ అప్పట్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
అయితే దీనిపై ఈటల రాజేందర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సర్వే సక్రమంగా జరగలేదని కోర్టులో పటిషిన్ దాఖలు చేసిన.. న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే హైకోర్టు రీ సర్వేకు ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలు మేరకు ఈ ఏడాది జూన్లో సమగ్ర సర్వే నిర్వహించాల్సి ఉండింది. అయితే కరోనా కారణంగా అది వాయిదా పడింది. తాజాగా నవంబర్ 8వ తేదీన జమున హేచరీస్కు నోటీసులు ఇచ్చిన అధికారులు.. మంగళవారం నుంచి ఇక్కడ సర్వే చేపట్టారు. నేడు రెండో రోజు భూసర్వే కొనసాగుతుంది. మంగళవారం.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో (Achampet) సర్వే నంబరు 130లోని 18.35 ఎకరాల భూమికి సంబంధించి సర్వే పూర్తి చేసి హద్దులు ఏర్పాటు చేశారు.
ఆర్డీవో శ్యాంప్రకాశ్, మాసాయిపేట తహసీల్దారు మాలతి, డివిజినల్ సర్వేయర్ లక్ష్మీసుజాత.. భూసర్వేను పర్యవేక్షిస్తున్నారు. గతంలో కేసీఆర్కు ఫిర్యాదు చేసిన రైతులు, జమునా హేచరీస్కు చెందిన ఇద్దరు ప్రతినిధులు, 20 మంది స్థానికుల సమక్షంలో సర్వే జరిపారు. సర్వే నేపథ్యంలో పోలీసులు ఆప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక, నేడు.. అచ్చంపేటలోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నెంబర్లలో భూసర్వే జరుగుతుంది. రేపు కూడా ఈ సర్వే జరగనుంది. గురువారం హకీంపేటకు(Hakimpet) చెందిన సర్వే నంబరు 97లోని భూములను సర్వే చేయనున్నారు. 18న ప్రభుత్వానికి సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్ తెలిపారు.