ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తనపై ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణను జస్టిస్ రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తనపై ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణను జస్టిస్ రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం వాయిదా వేసింది. కవిత అభ్యర్థనను గతంలో నళిని చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌కు ట్యాగ్ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టుగా తెలిపింది. దీంతో ప్రస్తుతానికైతే కవితకు ఎలాంటి రిలీఫ్ దక్కలేదనే చెప్పాలి. ఇక, మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళిని చిదంబరం ఆ పిటిషన్ దాఖలు చేశారు. 

ఇక, సుప్రీం కోర్టులో కవిత వేసిన పిటిషన్‌పై ఈడీ అధికారులు కేవియెట్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమను సంప్రదించకుండా ఆదేశాలు ఇవ్వొద్దని అందులో కోరింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో నేడు విచారణ సందర్భంగా కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజులు వాదనలు వినిపించారు. 

కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. కవితను విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారని.. నిందితురాలు కానప్పుడు విచారణకు ఎలా పిలుస్తారని అన్నారు. నిందితురాలుగా అభివర్ణిస్తున్నారని పేర్కొన్నారు. ఇక, ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ రస్తోగి.. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ విషయాలతో ట్యాగ్ చేస్తామని అన్నారు. విషయం వినడానికి వీలు కల్పిస్తామని... ట్యాగ్ చేసి వినడం మంచిదని అని పేర్కొన్నార. అయితే సొలిసిటటర్ జనరల్.. అలా చేయవద్దని, అభిషేక్ బెనర్జీ విషయం వేరని అన్నారు. ఈ క్రమంలోనే నళిని చిదంబరం పిటిషన్‌కు ట్యాగ్ చేస్తున్నట్టుగా జస్టిస్ రస్తోగి చెప్పారు. ఇక, ఇదిలా ఉంటే.. కవిత తన పిటిషన్‌లో కొత్త అభ్యర్థన చేశారు. మద్యం పాలసీ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఇక, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని కవిత సవాలు చేశారు. చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థలు మహిళను ఇంటిదగ్గరే విచారణ జరపాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు. క్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160కి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 

కవిత మార్చి 14న ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కవిత న్యాయవాది సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ను కోరారు. అయితే దానిని సీజేఐ తిరస్కరించారు. ఈ కేసును మార్చి 24న విచారిస్తామని తెలిపారు. అయితే ఆ తర్వాత ఈ కేసు మార్చి 27వ తేదీకి జాబితా చేయబడింది.