తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. తెలుగు అకాడమీ విభజనపై పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు సుప్రీం ధర్మాసనం అనుమతించింది.

తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. తెలుగు అకాడమీ విభజనపై పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు సుప్రీం ధర్మాసనం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ. 92.94 కోట్లను వారంలో వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. మిగిలిన మొత్తానికి 6 శాతం వడ్డీ చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు నెల సమయమిచ్చింది. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం చెప్పింది. 

ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి తెలుగు అకాడమీ విభజన అంశం సమస్యగా మారిన సంగతి తెలిసిందే. విభజన చట్టం ప్రకారం తెలుగు అకాడమీ నిధులు, సిబ్బందిని 42:58 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. ఇక, తెలుగు అకాడమీ విభజన పూర్తి చేయాలని గతేడాది తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే అకాడమీకి చెందిన బ్యాంకు డిపాజిట్లను విత్ డ్రా చేసేందుకు అధికారులు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రూ. 65 కోట్ల నిధుల గల్లంతు వ్యవహారం వెలుగుచూసింది. దీంతో తెలుగు అకాడమీ విభజన ప్రక్రియ నిలిచిపోయింది.