తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వద్ద నిలిచిపోయిన పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వద్ద నిలిచిపోయిన పెండింగ్ బిల్లులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. గవర్నర్ వద్ద 10 పెండింగ్ బిల్లులు వుండటంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది. అయితే ఈ విషయమై గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా స్పందించారు. ఏం జరుగుతుందో తెలుసుకుంటానని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ఈ మధ్యే వచ్చాయని సుప్రీం కోర్టుకు తుషార్ మెహతా తెలిపారు. 

కాగా.. యూనివర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు కామన్ బోర్డు ఏర్పాటు, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల చట్టసవరణ, జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ,ములుగులో ఫారెస్ట్ పరిశోధన సంస్థ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం, జీఎస్టీ చట్ట సవరణ, ఆజామాబాద్ పారశ్రామిక ప్రాంత చట్టం వంటి బిల్లులు రాజ్ భవన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర పడాలి. అయితే ఈ బిల్లులను అధ్యయనం చేస్తున్నట్టుగా గతంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రకటించిన విషయం తెలిసిందే. యూనివర్శిటీల్లో నియామకాల విషయంలో కామన్ బోర్డు ఏర్పాటు అంశానికి సంబంధించి యూజీసీతో కూడా గవర్నర్ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.