హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టులో ఊరట.. ఇళ్ల స్థలాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పదవీ విరమణకు ఒక్క రోజు ముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన వ్యవహారంలో కీలక తీర్పు ఇచ్చారు.
హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పదవీ విరమణకు ఒక్క రోజు ముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన వ్యవహారంలో కీలక తీర్పు ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో సుప్రీంలో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడని చెప్పారు. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని గుర్తు చేశారు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలని అన్నారు.
రూ. 8 వేల నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుకున్నట్టు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. జర్నలిస్టులకు భూమి కేటాయించారని.. కానీ అభివృద్ధి చేయలేదని అన్నారు. ఆ స్థలం కోసం వారంతా కలిసి రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారని అన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి అనుమతిస్తున్నట్టుగా తీర్పు వెలువరించారు. ఆ స్థలాల్లో నిర్మాణాలు కూడా జరపుకోవచ్చని చెప్పారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు.
ఇక, సుప్రీం కోర్టు తీర్పుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇంటి స్థలాల కేటాయింపులపై తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్ను క్లియర్ చేసినందుకు సుప్రీం కోర్టుకు, సీజేఐకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్ట్ స్నేహితులకు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు.