విద్యార్థులను కెసిఆర్ శత్రువుల్లా చూస్తున్నారా?
- రెండేళ్లుగా విద్యార్థుల పీజు బకాయీలను చెల్లించని ప్రభుత్వం
- సంక్షోభంలో తెలంగాణా విద్యార్థులు
- పీజు బకాయీ చెల్లించేందాకా ఉద్యమం -కాంగ్రెస్
తెలంగాణాలో పీజు రియింబర్స్ మెంట్ రాని విద్యార్థులు రోడ్డెక్కారు. ఈరోజు దిల్ షు క్ నగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నూజివీడు రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐ టిలో చదువు తున్న దాదాపు వేయి మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తెలంగాణా ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడంతో సర్థిపికెట్లు కూడా పొందలేక, ఉద్యోగాలకు దరఖాస్తు చేయకలేక యాతనపడుతున్న విషయాన్ని ఏషియానెట్ తెలుగు వెలుగులోకి తెచ్చింది. ఇదే పరిస్థితిని తెలంగాణాలో చదువుతున్న కొన్ని లక్షల మంది ఎదుర్కొంటున్నారు. ఈ జాప్యాన్ని నిరసిస్తూ ఎన్ఎస్ యు ఐ దిల్ షుక్ నగర్ లో విద్యార్థి ’పోరు గర్జన’ నిరసన తెలిపింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూపూర్తిగా బకాయిలు ఇచ్చేంతవరకూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలు కె.జానరెడ్డి(అసెంబ్లీ), మహ్మద్ అలీ షబ్బీర్ (కౌన్సిల్) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణా విద్యార్థులను శత్రువులుగా చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆరోపించారు.
పాత భవనాలని ఉన్న భవనాలను కూల్చడం మీద, అవసరం లేకపోయినా కొత్తవి కట్టడం మీద వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలా నిధులు వృధా చేయకుండా విద్యార్థుల బకాయీలు చెల్లించాలని వారు కోరారు. వాస్తు బాగోలేదనో పాతబడి మాసిపోయిందనో చార్మినార్ ను కూల్చేస్తారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామన్న హామీని గాలికొదిలేసి తనకు మాత్రం విలాసవంతమైన భవంతిని నిర్మించుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు. హామీ ప్రకారం పేదలకు ఇళ్లు నిర్మించిన తర్వాతే కేసీఆర్ అధికార నివాసంలోకి వెళ్లాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, ఎమ్మెల్యేలు జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్రెడ్డి, భిక్షపతి యాదవ్, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.