బిర్యానీ ప్యాకెట్ కనిపించడం లేదని అడిగినందుకు ఓ విద్యార్థి ఏకంగా హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి దూకేశాడు. దీంతో అతని కాలు విరిగింది.
మహబూబ్ నగర్ : తన biryani packet కనిపించడం లేదంటూ ఒక విద్యార్థి అడిగినందుకు... మరో విద్యార్థి హాస్టల్ టెర్రస్ పై నుంచి కిందికి దూకేశాడు. దీంతో అతని కాలు విరిగింది. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా.. అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహంలో ఆదివారం జరిగింది. అమ్రాబాద్ మండలం ఎల్లంపల్లికి చెందిన రామస్వామి, సువర్ణ దంపతుల కుమారుడు రాజేష్. స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అక్కడే బాలుర వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం కావడంతో విద్యార్థులను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. ఈ క్రమంలో అదే తరగతికి చెందిన అరుణ్ అనే విద్యార్థి తల్లిదండ్రులు కూడా వచ్చారు. వారు కొడుకు కోసం బిర్యానీ ప్యాకెట్ తీసుకుని వచ్చారు.
ఆ బిర్యానీ ప్యాకెట్ ను అరుణ్ మధ్యాహ్నం తిని.. మిగిలింది రాత్రికి తినేందుకు బాక్స్ లో పెట్టుకున్నాడు. అయితే, కొద్దిసేపటి తరువాత వచ్చి చూస్తే బాక్స్ లో పెట్టుకున్న బిర్యానీ ప్యాకెట్ కనిపించలేదు. దీంతో తోటి స్నేహితులను ఆరా తీశాడు. ఈ క్రమంలోనే రాజేష్ ను కూడా ప్రశ్నించాడు. అయితే, అరుణ్ అడిగిన దానికి రాజేష్ ఏమీ మాట్లాడకుండా.. హాస్టల్ టెర్రస్ పైకి ఎక్కి.. పైనుంచి దూకేశాడు. ఇది తెలిసి అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే రాజేష్ ను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రాజేష్ కు చికిత్స అందించిన డాక్టర్లు.. అతని ఎడమ కాలు విరిగింది అని అనుమానం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్ బిర్యానీ...!!
ఇదిలా ఉండగా, మార్చిలో హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఐదు రూపాయల కోసం జరిగిన గొడవ చివరికి కోర్టు వరకు వెళ్ళింది.హోటల్ కు వెళ్లిన వ్యక్తికి తిన్నదానికంటే రూ.5.50 ఎక్కువగా బిల్లు వేసినందుకు వినియోగదారుడు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్-2 బెంజ్ అధ్యక్షుడు నరసింహారావు తీర్పు వెలువరించారు. ఫిర్యాదీపై పరుష పదజాలం ఉపయోగించడంతోపాటు సేవల్లో లోపం కలిగించినట్లు గుర్తించి.. అదనంగా వసూలు చేసినా రూ.5.50కి పది శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు.. ఫిర్యాదీకి ఐదు వేల పరిహారం, జిల్లా వినియోగదారుల సంరక్షణ సంక్షేమం కోసం రూ.50 వేలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చెల్లించాలని ఆదేశించారు.
చిలుకూరి వంశీ ఉస్మానియా యూనివర్సిటీలోని గౌతమి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి తిలక్ నగర్ లో ఉన్న లక్కీ బిర్యాని హౌజ్ కి వెళ్ళారు. బిల్లు రూ.1,075జీఎస్టీ కలుపుకుని మొత్తం రూ.1,127..50 అయ్యింది. మినరల్ వాటర్ బాటిల్ కు అదనంగా రూ.5 వసూలు చేశారని గుర్తించారు. దీన్ని ప్రశ్నించగా బిర్యాని హౌస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా తన నుంచి రూ.5.50 అదనంగా వసూలు చేశారని, స్నేహితుల ముందు తనను అవమానించారని చిలుకూరి వంశీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాది అందించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన బెంచ్.. ప్రతి వాది సంస్థ సేవల్లో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఇకపై ఈ పొరపాటు చేయొద్దంటూ మందలిస్తూ జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
