లేడీస్ సీట్లలో కూర్చుంటే.. ఇక అంతే
మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేకించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే రూ.500 జరిమానా వేస్తామన్నారు.
హైదరాబాద్ మెట్రోలో ఓ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. మహిళల కోసం కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చుంటే జరిమానా విధించనున్నట్లు హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
సోమవారం మెట్రోరైల్ భవన్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేకించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే రూ.500 జరిమానా వేస్తామన్నారు. ప్రతీ బోగీలో ఎల్అండ్టీ భద్రతా సిబ్బంది, పోలీసు నిఘాను అధికం చేస్తామని వివరించారు.
ఈ విషయంలో మహిళా ప్రయాణికులు తమకెదురయ్యే అసౌకర్యాన్ని తెలియజేసేందుకు ఓ వాట్సాప్ నంబరును కేటాయించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ నిర్ణయాలను త్వరలో అమలు చేస్తామని ఎల్అండ్టీ అధికారులు హామీ ఇచ్చారు. మెట్రోస్టేషన్ల పరిసరాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు.