కొన్ని క్షణాల్లోనే పెళ్ళి: ప్రియురాలి కిడ్నాప్, ప్రియుడిపై దాడి
లవర్ కు ట్విస్టిచ్చిన కుటుంబసభ్యులు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెళ్ళి చేసుకోనేందుకు రెడీగా ఉన్న ప్రేమ జంటను యువతి కుటుంబసభ్యులు అడ్డుకొన్నారు. ప్రియుడిపై దాడి చేసి ప్రియురాలిని ఎత్తుకెళ్ళారు. తాము ఇద్దరం మేజర్లమని తమ వివాహం జరిపించాలని ప్రియుడు ప్రాణదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తాను ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రియుడు డిమాండ్ చేస్తున్నాడు.
నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్ మక్లూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సౌజన్యలు మూడేళ్ళుగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహరం సౌజన్య కుటుంబసభ్యులకు తెలిసింది. సౌజన్యను మందలించారు.
అయితే తమ పెళ్ళికి కుటుంబసభ్యులు ఒప్పుకోని కారణంగా ప్రాణదీప్, సౌజన్యలు బుధవారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్లో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకొన్నారు. ప్రాణదీప్ స్నేహితులు వారికి పూర్తిగా అండగా నిలిచారు. ఆర్యసమాజ్లో మరికొద్దినిమిషాల్లోనే వివాహం జరగాల్సి ఉంది.
అయితే సౌజన్య బంధువులకు విషయం తెలిసి ఆర్యసమాజ్ కు చేరుకొన్నారు. సౌజన్యతో పాటు ప్రాణదీప్పై దాడి చేశారు. ఈ దాడిలో ప్రాణదీప్కు గాయాలయ్యాయి. సౌజన్యను వెంటనే కుటుంబసభ్యులు దాడి చేసి టూ వీలర్పై తీసుకెళ్ళారు.
ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ప్రాణదీప్ నిజామాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. తామిద్దరం కూడ మేజర్లమేనని ఆయన చెప్పారు. అంతేకాదు తామ పెళ్ళికి సహకరించాలని ఆయన కోరారు.