కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు : ఏడెనిమిది రోజుల్లో తెలంగాణలో ప్రవేశం
మూడు రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు
మండుటెండల వల్ల విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాలు ఏడెనిమిది రోజుల్లో తెలంగాణ ను తాకనున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.
జూన్ 1 న ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ఇదివరకే ఐఎండీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిన్న అండమాన్ నికోబార్ దీవులను పూర్తిగా ఆవరించిన ఈ రుతు పవనాలు వేగంగా ముందుకు కదిలాయి. వాతావరణం ఈ రుతుపవనాలకు సహకరించడంతో మూడు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు.
రుతుపవనాల రాకతో కేరళలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నైరుతి రాకతో దేశంలో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇదే అనుకూల వాతావరణం కొనసాగితే సకాంలోనే తెలంగాణకు రుతుపనాలు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.