మానవత్వాన్ని చంపేస్తున్న కరోనా: తల్లిని పొలంలో వదిలేసిన కొడుకులు
మానవత్వం మంటగలుస్తోంది. చనిపోయిన వారి మృతదేహాలను చూసైనా తోటివారి మనసు కరగడం లేదు
మానవత్వం మంటగలుస్తోంది. చనిపోయిన వారి మృతదేహాలను చూసైనా తోటివారి మనసు కరగడం లేదు. ‘కరోనా’తో పాటు వ్యాధి సోకిందన్న అనుమానంతో బంధువులు.. చుట్టు పక్కల ప్రాంతాల వారి సూటిపోటి మాటలతో.. కనీసం కడయాత్రైనా సజావుగా జరగని హృదయ విదాకరమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.
తాజాగా కరోనా వచ్చిందన్న కారణంతో జన్మనిచ్చిన మాతృమూర్తినే కడుపున పుట్టినవాళ్లు కాదనుకున్నారు. తల్లికి పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న కుమారులు ఇంట్లో నుంచి తీసుకెళ్లి వ్యవసాయ బావి వద్ద వదిలేశారు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన మారబోయిన లచ్చమ్మ(82)కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో తల్లిని ఒంటరిగా వ్యవసాయ బావి వద్ద వదిలేశారు కన్నకొడుకులు.
ఆమె పరిస్థితి చలించిపోయిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధురాలి కుటుంబసభ్యులను ఒప్పించిన పోలీసులు.. ఆమె చిన్న కొడుకు ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచారు.