తల్లిదండ్రులు ఆకలితో చనిపోవడానికి కారణం అవడమే కాదు కరోనాతో చచ్చారని మరో అబద్దం ఆడి అంత్యక్రియలు చేపిన ఓ కసాయి కొడుకు కటకటాలపాలయ్యాడు. 

సూర్యాపేట: వృద్ధాప్యంలో వున్న తల్లిదండ్రులకు కనీసం అన్నం కూడా పెట్టకుండా కడుపుమాడ్చి అతి కిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. తల్లిదండ్రులన్న ప్రేమతో కాకున్నా కోట్ల ఆస్తిని సంపాదించి పెట్టారని కనీస కనికరం చూపలేడు. ఇలా ఆకలితో చనిపోయిన తల్లిదండ్రులను కరోనాతో చచ్చారని మరో అబద్దం ఆడి అంత్యక్రియలు చేశారు. చివరకి ఈ కసాయి కొడుకు పాపం పండి అసలు నిజం బయటపడింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా మోతె మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి(90), అనసూయమ్మ(85) దంపతులకు నాగేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వినోద ముగ్గురు సంతానం. అందిరికీ పెళ్లిల్లు అయిపోయారు. వయసు మీద పడటంతో 40ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇతర ఆస్తులను కూడా ఇద్దరు కుమారులకు పంచేశారు. తల్లిదండ్రులిద్దరూ ఇద్దరు కొడుకుల వద్ద చెరో నెల వుండేవారు. 

read more చెల్లిని వేధిస్తున్నాడని.. ఏకంగా బావనే చంపేశారు..!

అయితే కొన్నేళ్ల క్రితం చిన్న కొడుకు ప్రభాకర్ రెడ్డి చనిపోవడంతో తల్లిదండ్రుల బాధ్యతంతా పెద్ద కూమారుడే చూసుకుంటున్నాడు. అయితే వారిని చూసుకోవడం బాధ్యతగా కాకుండా భారంగా భావించాడు పెద్దకొడుకు, కోడలు. దీంతో వారిని ఇంటి వెనకాల ఓ రేకుల షెడ్డులో వుంచి అన్నం కూడా పెట్టకుండా కఠినంగా వ్యవహరించారు. కొద్దిరోజులగా ఆకలి బాధతో అలమటించిన ఈ వృద్ధ దంపతులు చివరకు ప్రాణాలు వదిలారు. 

తల్లిదండ్రులు చనిపోయినట్లు తెలుసుకున్న నాగేశ్వర్ రెడ్డి మరో కొత్త నాటకానికి తెరతీశాడు. వారు కరోనాతో బాధపడుతూ చనిపోయారని పేర్కొంటూ అంత్యక్రియలు చేపట్టాడు. అయితే ఈ మరణాలపై అనుమానంతో కూతురు వినోద పోలీసులను ఆశ్రయించింది. దీంతో మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం చేయగా అసలు నిజం బయటపడింది. సరైన ఆహారం అందించకపోవడంతో వృద్ధ దంపతులు మృతి చెందారని శవ పరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో వృద్ధ దంపతుల మృతికి కారణమైన నాగేశ్వరరెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు పోలీసులు.