స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ బోగిలో పొగలు.. భయాందోళన చెందిన ప్రయాణికులు..
స్వర్ణజయంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపూరం వద్దకు చేరుకన్న సమయంలో బోగీలో నుంచి పొగలు వచ్చాయి.
మహబూబాబాద్: హజ్రత్ నిజాముద్దీన్ నుంచి త్రివేండ్రం వెళ్ళుతున్న స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్కు ప్రమాదం తప్పింది. రైలు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపూరం వద్దకు చేరుకన్న సమయంలో బోగీలో నుంచి పొగలు వచ్చాయి. దీంతో రైలును నిలిపివేశారు. బోగి నుంచి పొగలు రావడంతో భయాందోళన చెందిన ప్రయాణికులు రైలు దిగారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. రైలు నిలిచిన చోటుకు చేరుకున్నారు.
అయితే బ్యాటరీలో వచ్చిన సాంకేతిక సమస్య కారణంగా పొగలు వచ్చినట్టుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. సమస్యను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేశారు. దీంతో దాదాపు 45 నిమిషాల తర్వాత ట్రైన్ తిరిగి బయలుదేరింది.