తెలంగాణ హైకోర్టులో ఆరుగురు కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం..
తెలంగాణ హై కోర్టుకు నియమితులైన ఆరుగురు జడ్జీలు ఇవ్వాళ ప్రమాణస్వీకారం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మంగళవారం కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు జడ్జిలుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్, నగేష్, పి.కార్తీక్, కె.శరత్ లు ప్రమాణం చేశారు. కొత్తగా నియమితులైన హైకోర్టు జడ్జిలతో సీజే ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శుక్రవారం ఆమోదించారు. నలుగురిని జడ్జీలుగా, ఇద్దరినీ అదనపు జడ్జీలుగా నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజేందర్ కశ్యప్ నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం వీరితో ప్రమాణస్వీకారం చేయించారు.
Munugode bypoll 2022 : టిఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి ఇంటివద్ద అర్థరాత్రి హై డ్రామా..
కొత్త జడ్జీలుగా నియమితులైన వారిలో న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్ అలియాస్ పి ఎలమందర్, కాజా శరత్.. అదనపు జడ్జీగా నియమితులైన వారిలో జె శ్రీనివాస రావు, ఎన్ రాజేశ్వరరావు ఉన్నారు. కాగా, సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42 పెంచారు. గత సంవత్సర కాలంలో 24 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. తాజాగా ఆమోదం పొందిన వారితో కలిసి రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరుకుంది. ఈ నేపథ్యంలో మరో ఎనిమిది మంది న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.