వరి వేస్తే వేటాడుతా.. సుప్రీం చెప్పినా వినను : సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై దుమారం.. రేవంత్ ఫైర్
సిద్ధిపేట కలెక్టర్ (siddipet collector) వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) వ్యాఖ్యలపై తెలంగాణలో (telangana) దుమారం చెలరేగుతోంది. రైతులు ఒక్క ఎకరం వరి (paddy seeds) వేసుకున్నా కూడా అది ఉరి వేసుకున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.
సిద్ధిపేట కలెక్టర్ (siddipet collector) వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) వ్యాఖ్యలపై తెలంగాణలో (telangana) దుమారం చెలరేగుతోంది. రైతులు ఒక్క ఎకరం వరి (paddy seeds) వేసుకున్నా కూడా అది ఉరి వేసుకున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై వెంకట్రామిరెడ్డి స్పందిస్తూ... తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లను (dealers) కోరామని ఆయన స్పష్టం చేశారు. అందుకు డీలర్లు సహకరిస్తామన్నారని.. ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు లాభమని కలెక్టర్ సూచించారు. అసత్యాలను ప్రచారం చేయడం సరికాదని వెంకట్రామిరెడ్డి హితవు పలికారు.
కాగా.. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తనాలు సరఫరా చేసే డీలర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ కలెక్టర్ వ్యాఖ్యానించారు.
Also Read:యాసంగి పంటలు: ఏవి బెటర్.. రేపు కేసీఆర్కు చేరనున్న నిపుణుల నివేదిక
ఎవరైనా వ్యాపారులు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వారి షాపులు సీజ్ చేస్తానని, భవిష్యత్తులో ఏ పని చేసుకోనివ్వకుండా చేస్తానని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. తాను కలెక్టర్గా ఉన్నంత కాలం ఇలాగే వుంటుందని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు (supreme court) ఆదేశించినా, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు చెప్పినా తాను విననని కలెక్టర్ హెచ్చరించారు. డీలర్లు కనుక ఒకవేళ విత్తనాలు అమ్మినట్లు గుర్తిస్తే ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారని హెచ్చరించారు.
మరోవైపు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) ఫైర్ అయ్యారు. వరి విత్తనాలు విక్రయిస్తే షాపులు సీజ్ చేస్తామని.. సుప్రీం కోర్టు ఆర్డర్ తెచ్చినా షాపులు తెరవనిచ్చేది లేదని డీలర్లను కలెక్టర్ బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ సుప్రీం కోర్టు కంటే సుప్రీమా? అని సూటిగా ప్రశ్నించారు. వెంటనే తెలంగాణ సీఎంవో (telangana cmo) స్పందించి సిద్దిపేట కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.