కేన్సస్: శరత్పై అందుకే కాల్పులు, క్షణాల్లోనే ఇలా...
రెస్టారెంట్లో దోపీడీ చేసేందుకు వచ్చిన దుండగుడిని శరత్ అడ్డుకొనే ప్రయత్నం చేశాడు, ఆ క్రమంలోనే శరత్ నుండి తప్పించుకొనేందుకు నిందితుడు కాల్పులు జరిపాడని రెస్టారెంట్ యజమాని షాహిద్ చెప్పారు. కేన్సస్లో జరిగిన కాల్పుల్లో శరత్ మరణించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: అమెరికాలోని కేన్సస్ లోని రెస్టారెంట్లో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్ధి శరత్కుమార్ మృత్యువాత పడ్డారు. రెస్టారెంట్లో దుండగుడు దోపీడీకి పాల్పడేందుకు ప్రయత్నిస్తే శరత్ కుమార్ అడ్డుకొన్నాడని పోలీసులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే దుండగుడు శరత్పై కాల్పులు జరిపి ఉంటాడని అమెరికా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
శుక్రవారం రాత్రి పూట కేన్సస్ రెస్టారెంట్లో జరిగిన కాల్పుల్లో తెలంగాణ విద్యార్ధి శరత్ మృత్యువాతపడ్డాడు. ఎంఎస్ చేసేందుకు వెళ్ళిన శరత్ పార్ట్టైమ్గా రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నాడు. రెస్టారెంట్లో శరత్ పనిచేసే విషయం తమకు తెలియదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
రెస్టారెంట్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు రెస్టారెంట్లో ఓ దుండగుడు దోపీడీకి యత్నించాడని అయితే దీన్ని శరత్ అడ్డుకొనే ప్రయత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో దుండగుడు శరత్పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్టు కేన్సస్ పోలీసులు చెబుతున్నారు.
రెస్టారెంట్లో ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారని రెస్టారెంట్ యజమాని షాహిద్ చెప్పాడు. గుర్తు తెలియని వ్యక్తి రెస్టారెంట్ లోకి వచ్చి దోపీడీకి ప్రయత్నించాడని ఆయన చెప్పారు. దుండగుడు వచ్చి తుపాకీతో తమను బెదిరించాడని చెప్పాడు. అయితే శరత్ అతడిని అడ్డుకొనే ప్రయత్నించాడని చెప్పారు. తామంతా వారించేసరికి శరత్ నుండి తప్పించుకొనే క్రమంలో దుండగుడు శరత్పై కాల్పులకు దిగాడని ఆయన చెప్పారు. శరత్ వెనుకవైపు తూటాలు తగిలాయని ఆయ చెప్పారు.
తాము పోలీసులకు సమాచారం ఇచ్చేలోపుగానే నిందితుడు పారిపోయాడని షాహిద్ చెప్పాడు. ఎంఎస్ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్ నగరం ప్రాస్పెక్ట్స్ అవెన్యూలోని జేఎస్ ఫిష్ అండ్ చికెన్ మార్కెట్ అనే ఓ హోటల్లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు