బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు రానున్నారు. 

హైదరాబాద్‌: బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. కేసీఆర్ సమక్షంలో మ‌హారాష్ట్రకు చెందిన రైతు సంఘం కీల‌క నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఆయన  మద్దతుదారులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. 

బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్.. మహారాష్ట్ర రాజకీయాలపై కూడా ఫోకస్ చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయనున్న నేపథ్యంలో.. అక్కడ రెండు బహిరంగ సభలను కూడా నిర్వహించారు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన  పలువురు నేతలు బీఆర్ఎస్‌ కండువా కప్పుకుంటున్నారు.