రాష్ట్ర మొస్తే నేరాల రాజ్యమవుతుందన్నారు, ఎక్కడ?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణా ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో నేరాలు బాగా తగ్గిపోయాయని ఐటి, మునిసిపల్ మంత్రి కె టి రామారావు అన్నారు.

శాంతి భద్రతల విషయంలో తెలంగాణా వ్యతిరేకులు చేసిన ప్రచారం పటాపంచలయిందని, నేర నివారణలో తెలంగాణా ఇపుడు ఆదర్శంగా నిలుస్తూ ఉందని ఆయన అన్నారు.

తెలంగాణలో నేరాల నియంత్రణ కోసం చేపడుతున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ ప్రాజెక్టును ఈ రోజు డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ లతో కలసి కెటిఆర్ ప్రారంభించారు.

తెలంగాణా వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రజలను బెదరగొట్టే ప్రయత్నం చేశారని , ఇదంతా తప్పుడు ప్రచారమని కేవలం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ను అడ్డుకునేందుకు చేసిన దుష్ప్రచారమని కెటిఆర్ చెప్పారు.

రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఇస్తున్నారని, ప్రజల్లో శాంతిభద్రతల గురించి భరోసా కల్గించేలా పోలీసు యంత్రాంగాన్ని తీర్చి దిద్దడం ఇందులోప్రధానమైనదని ఆయన తెలిపారు.

‘ శాంతిభద్రతలు సజావుగా ఉన్నపుడే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకునే పోలీసు యంత్రాంగంపనిచేస్తున్నది. తెలంగాణా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. షీటీమ్స్ ను ప్రవేశపెట్టడం ఒక గొప్ప చర్య . ఇది ఎన్నో ప్రశంసలందుకుంటూ ఉంది,’ అని ఆయన చెప్పారు.