టీపీసీసీ చీఫ్.. తెరపైకి జీవన్ రెడ్డి
రేవంత్ను ప్రచార కమిటీ చైర్మన్గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్రెడ్డి అంటున్నారు.
టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఎవరు అనే విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డి కి టీపీసీసీ చీఫ్ పదవి అప్పగిస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే.. సడెన్ గా.. తెరపైకి సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది.
రేవంత్ను ప్రచార కమిటీ చైర్మన్గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్రెడ్డి అంటున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కాగా, రేవంత్రెడ్డిని పీసీసీ చీఫ్గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది.
అయితే ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు మాత్రం రేవంత్కే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్రెడ్డిని పీసీసీ చీఫ్గా, రేవంత్ను ప్రచార కమిటీ చైర్మన్గా నియమించే యోచనలో అధిష్ఠానం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిని ముఖ్యనేతలెవరూ ధ్రువీకరించడంలేదు. అలా అని తోసిపుచ్చడమూ లేదు. జీవన్రెడ్డి అధ్యక్షుడయ్యేందుకు 50-50 అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జీవన్రెడ్డి, డి.శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్ తదితర నేతల పేర్లను ఆమె పరిశీలించి.. ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో నిర్ణయించనున్నట్లు సమాచారం.