రోజాపై సీనియర్ అసిస్టెంట్ దాడి: పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని రోజాపై సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ దాడికి దిగాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకొంది.
కామారెడ్డి: మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని రోజాపై సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ దాడికి దిగాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకొంది.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో రోజా అనే మహిళ ఇంటి పన్ను వసూలు చేసే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోంది. అయితే బోధన్ మున్సిపల్ కార్యాలయంలో రామకృష్ణ సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
గతంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో రామకృష్ణ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత ఆయన బోధన్ మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లాడు.
ఇవాళ రామకృష్ణ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వచ్చాడు. రోజా అనే మహిళా ఉద్యోగిని పనిచేసే డెస్క్ వద్దకు వెళ్లి ఆమెతో రామకృష్ణ గొడవకు దిగాడు. తన ఫోన్ ను ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ఆయన ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు ఆమెపై చేయిచేసుకొన్నాడు. తన ఫోన్ నెంబర్ ను బ్లాక్ లో పెడతావా అని రామకృష్ణ దాడికి దిగినట్టుగా రోజా ఆరోపిస్తోంది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది
రామకృష్ణ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే సమయంలో సహా ఉద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవాడు. అందరితో మాట్లాడేవాడు. అయితే ఇవాళ రోజాపై ఎందుకు దాడికి దిగాడనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.