సికింద్రాబాద్ రూబీ హోటల్లో అగ్నిప్రమాదం కారణంగా మరణించిన వారిని పోలీసులు గుర్తించారు. రూబీ హోటల్లో అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మరణానికి పొగే కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రూబీ హోటల్లో అగ్నిప్రమాదం కారణంగా మరణించిన వారిని పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏడుగురిని గుర్తించినట్లుగా తెలుస్తోంది. మరొకరిని గుర్తించే ప్రయత్నాల్లో వున్నారు. మరణించిన వారిని అల్లాడి హరీశ్, బాలాజీ, వీరేంద్ర కుమార్, సీతారామన్, రాజీవ్ మాలిక్, సందీప్ మాలిక్, మిథాలి మహాపాత్రలుగా గుర్తించారు. గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు పది మంది. వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు.. రూబీ హోటల్లో అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మరణానికి పొగే కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ భవనంలో నిబంధనలను ఉల్లంఘించారని, సెల్లార్లో రూల్స్కి వ్యతిరేకంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. లిఫ్ట్ చుట్టూ మెట్లు వుండటం కూడా ప్రమాద తీవ్రతకు కారణంగా తెలుస్తోంది.
Also REad:సికింద్రాబాద్ రూబీ లాడ్జీ భవనంలో రెండు లోపాలు: అగ్నిమాపక రీజినల్ అధికారి పాపయ్య
ఈ భవనం ఎత్తు 17.5 మీటర్లు ఉంది. దీంతో ఈ భవనానికి రెండు వైపులా మెట్లు ఉండాలి. కానీ ఈ భవనానికి ఒకే చోట మెట్లున్నాయి. ఈ మెట్లు కూడా లిఫ్ట్ చుట్టూ మెట్లు ఉండడాన్ని అగ్నిమాపక సిబ్బంది తప్పుబడుతున్నారు. ఈ భవనంలో ఎక్కువగా అద్దాలున్నాయి. ఈ కారణంగా అగ్నిప్రమాదంతో ఏర్పడిన పొగ బయటకు వెళ్లే మార్గం లేకపోయిందని అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ పొగ బేస్ మెంట్ నుండి నేరుగా పై అంతస్తులకు వ్యాపించింది. లాడ్జీ నుండి బయటకు వచ్చేందుకు మెట్ల గుండా వచ్చిన వారు పొగతో ఊపిరి ఆడక మరణించారు. లాడ్జీ కారిడార్లు, మెట్ల వద్ద మృతదేహలను గుర్తించామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
