నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ సర్పంచ్ కుటుంబంలో నలుగురు దుర్మరణం పాలైంది

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ సర్పంచ్ కుటుంబంలో నలుగురు దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం మిర్యాలగూడ నుంచి బియ్యం లోడుతో వస్తున్న ఓ లారీ నిడమనూరు వద్ద ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఆ వాహనం పక్కకు ఒరిగింది. అదే సమయంలో వెనుకే వస్తున్న బైక్‌పైకి టాటా ఏస్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న తెప్పలమడుగు గ్రామ సర్పంచ్‌ తరి శ్రీనివాస్‌ (34), అతడి భార్య విజయ (30) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

కుమార్తె శ్రీవిద్య (5), కుమారుడు కన్నయ్య (3)కు తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు చిన్నారులను హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు మరణించారు.

మరోవైపు టాటా ఏస్‌ వాహనంలో ఉన్న వారిలో ముగ్గురు గాయపడగా వారికి కూడా మిర్యాలగూడ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముప్పరంలోని విజయ పుట్టింట్లో ఓ శుభకార్యం ఉండటంతో శ్రీనివాస్ భార్యా పిల్లలతో కలిసి అక్కడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకే రోజు, ఒకే ప్రమాదంలో సర్పంచ్ కుటుంబం దుర్మరణం పాలవ్వడంతో తెప్పలమడుగులో విషాదం అలుముకుంది.