Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె... ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు బంద్ ప్రకటించారు. ప్రభుత్వంతో వారు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో... శుక్రవారం అర్థరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు.  దీంతో... ఎక్కడికక్కడ బస్సులన్నీ బస్టాండుల్లోనే నిలిచిపోయాయి. దసరా పండగవేళ ఆర్టీసీ సమ్మె ప్రకటించడం ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. బస్సులు లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు.

 

RTC workers strike continues in telangana
Author
Hyderabad, First Published Oct 5, 2019, 7:32 AM IST

తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. కాగా... కార్మికుల సమ్మెకు ప్రతిపక్ష పార్టీ  నేతలు మద్దతు పలికారు. డిపోల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని డిపోల దగ్గర 144 సెక్షన్ విధించి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. కార్మికుల సమ్మె ప్రభావం దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారి మీద పడకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
 
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోల్లో 4,153 మంది కార్మికులు విధుల్లో చేరకుండా ధర్నాకు దిగారు. ఖమ్మం జిల్లాలో పోలీసు భద్రతతో ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. డిపోల దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు డిపోల్లోని ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోల పరిధిలోని 2500 మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా త్రిసభ్య కమిటీతో మరోసారి జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలో సకల జనుల సమ్మెను మించిన సమ్మె ప్రస్తుతం అవసరమని.. అద్దె బస్సు  డ్రైవర్లు దీనికి సహకరించాలని కార్మిక సంఘాలు కోరాయి.

ఆర్టీసీలోని 50 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని.. ఎవరైనా డ్రైవర్లు బస్సులు నడిపితే వేలాది మంది కార్మికులకు ద్రోహం చేసినట్లేనని అశ్వత్థామరెడ్డి తెలిపారు.మరోవైపు సర్వీసులు పెంచాలని ఓలా, ఉబెర్‌, మెట్రో సంస్థలను కోరారు... సర్వీసులను పెంచడంతోపాటు ఎక్కువ ఛార్జ్‌ చేయొద్దని మెట్రో అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో స్పందించిన మెట్రో అధికారులు మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచారు. తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు నడుస్తుందని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రకటించింది.ఆర్టీసీలో అందుబాటులో ఉన్న 2100 అద్దెబస్సులు నడపాలని భావిస్తున్నట్లు త్రిసభ్య కమిటీ సభ్యుడు సునీల్‌ శర్మ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను భర్తీ చేసి నడుపుతాం.

3 వేల మంది డ్రైవర్లను తీసుకుంటాం. స్కూల్‌ బస్సులు 20వేలు ఉన్నాయి. ప్రైవేటు, స్కూల్‌, అద్దె బస్సులను నడుపుతాం. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.డ్రైవర్లకు రూ. 1,500, కండక్టర్లకు 1,000, రిడైర్డ్ సూపర్ వైజర్లకు 1,500, రిడైర్డ్ మెకానిక్‌లకు 1,000, రిడైర్డ్ క్లర్క్‌లకు 1,000 చొప్పున రోజూ వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios