బస్సులో చినిగిన చీర.. ఆర్టీసీ కి ఫైన్
ఓ మహిళ చీర ఆర్టీసీ బస్సులో కొర్రుపట్టి చినిగింది. అందుకు ఆర్టీసీ యాజమాన్యం ఆమెకు రూ.3వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
ఓ మహిళ చీర ఆర్టీసీ బస్సులో కొర్రుపట్టి చినిగింది. అందుకు ఆర్టీసీ యాజమాన్యం ఆమెకు రూ.3వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..నల్గొండకు చెందిన కట్టెకోల నరసింహారావు, వాణిశ్రీ దంపతులు హైదరాబాద్లో వివాహానికి హాజరయ్యేందుకు 2018 ఆగస్టు 26న ఇక్కడి బస్టాండ్లో సూపర్లగ్జరీ బస్సు (టీఎస్05జెడ్ 0188) ఎక్కారు. బస్సు లోపలికి ఎక్కే డోరు వద్ద బయటకు తేలిన రేకు తగిలి వాణిశ్రీ పట్టుచీర కొంచెం చిరిగింది. తర్వాత బస్సు ఎక్కిన మరో మహిళ చీరా అలాగే చిరిగిపోయింది.
ఆ రేకును సరిచేయాలని డ్రైవర్కు నరసింహారావు దంపతులు చెప్పగా అది డిపో సిబ్బంది పని అని బదులిచ్చారు. డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో నరసింహారావు నల్గొండలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
టికెట్, బస్సు, బయటకు తేలిన రేకు, చిరిగిన చీర ఫొటోలను సాక్ష్యంగా సమర్పించారు. విచారణ చేపట్టిన ఫోరం.. ఆర్టీసీ లోపాలను ధ్రువీకరించింది. పట్టుచీరకు రూ.2 వేలు, ఇతర ఖర్చులకు మరో రూ.1,000 జరిమానాను ఈ నెల 18న విధించింది. దీంతో.. ఆర్టీసీ యాజమాన్యం.. ఆమెకు రూ.3వేలు చెల్లించక తప్పలేదు.