హైదరాబాద్ టోలీచౌకీలో అర్థరాత్రి ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. సైకోలా మారి కత్తితో భయాందోళనలు కలిగించాడు. ఆస్పత్రిలోకి దూరి రోగి మీద హత్యాయత్నం చేశాడు. చివరికి అరెస్ట్ అయ్యాడు. 

హైదరాబాద్ : సైకోలా మారిన Rowdy sheeter అర్ధరాత్రివేళ Banjara Hills, Golconda పోలీసులను పరుగులు పెట్టించాడు. పట్టుకునేందుకు వెళ్లగా knifeతో బెదిరించాడు. Tolichowkiలోని ఓ ఆసుపత్రిలోకి వెళ్లి రోగి మెడపై కత్తి పెట్టి పొడుస్తానని బెదిరించాడు. పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.

నాంపల్లి బజార్ ఘాట్ కు చెందిన రౌడీ షీటర్ ఫరీద్ ఖాద్రీ(27) మతిస్థిమితం కోల్పోయి సైకోలా మారాడు. బుధవారం రాత్రి బంజారాహిల్స్ లోని సయ్యద్ నగర్ లో వరుసకు సోదరుడయ్యే మాజిద్ ను కలిశాడు. ఆ తర్వాత తన కారులో వెళ్తూ పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో స్థానికులు గుమిగూడారు. దీంతో కారు వదిలేసి.. కత్తి తీసి అటుగా వెళుతున్న వ్యక్తిని బెదిరించి ద్విచక్రవాహనం లాక్కుని పారిపోయాడు.

పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. నానల్ నగర్ వైపు నుంచి టోలిచౌకి వచ్చాడు. టోలిచౌకి నుంచి వెళ్లే దారిలో ఆటోలను అడ్డంగా ఉంచడంతో ఆటోను ఢీకొని కిందపడిపోయాడు. దగ్గరలోని ఓ హోటల్ లోకి వెళ్ళాడు. అప్రమత్తమైన సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఓ ద్వి చక్ర వాహనదారుడి సహకారంతో ఫరీద్ ను వెంబడించారు. ఈలోగా సమీపంలోని యాపిల్ ఆస్పత్రిలోకి చొరబడిన రౌడీషీటర్ ఓ రోగి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. అతడితో మాట్లాడుతూ.. దగ్గరకు వెళ్లిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.

విచారణలో ఫరీద్ తీసుకువచ్చిన కారు మల్కాజ్ గిరి పరిధిలో దొంగిలించింది అని గుర్తించారు. అతడిపై గోల్కొండ పిఎస్ లో సెక్షన్ 392, 332, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేశారు. సయ్యద్ నగర్ లో పోలీసు వాహనాన్ని ఢీ కొట్టినందుకు బంజారాహిల్స్ పోలీసులు, కారు చోరీ చేసినందుకు మల్కాజిగిరి ఠాణాల్లోనూ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం నాంపల్లి ఠాణా పరిధిలో ఓ బైకుకు నిందితుడు నిప్పంటించినట్లు గుర్తించారు. ఫరీద్ గతంలో ఏడాది పాటు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఉన్నాడు. అతని మీద 16 కేసులు ఉండడంతో రెండుసార్లు పీడీ చట్టం ప్రయోగించారు. అతని నుంచి 2 కత్తులు, బైకు స్వాధీనం చేసుకున్నారు.

గోల్కొండ ఠాణాలో ఫిర్యాదు...
టోలి చౌకి గుల్షన్ కాలనీకి చెందిన మక్బూల్ అహ్మద్, ఫరీద్ తమ్ముడు బషీర్ స్నేహితులు. గత ఏడాది డిసెంబర్ 31న బషీర్ తోపాటు మక్బూల్ అహ్మద్ మరి కొంతమంది స్నేహితులు బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సంగారెడ్డి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బషీర్ మృతి చెందాడు. దీంతో ఫరీద్ తరచూ డబ్బులు ఇవ్వాలని మక్బూల్ ను వేధిస్తున్నాడు. ఈ నెల 8న మక్బూల్ ఇంటికెళ్లి హల్చల్ చేశాడు. మక్బూల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.