విహారయాత్రలో విషాదం... రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ యువతి మృతి
విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు సాఫ్ట్ వేర్ యువతులు సరదాగా గడిపి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మరో గంటలో గమ్యానికి చేరుకుంటారనగా కారు ప్రమాదానికి గురయ్యి ఓ సాఫ్ట్ వేర్ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
జహీరాబాద్: సరదాగా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన సాప్ట్ వేర్ యువతి విగతజీవిగా తిరిగివచ్చింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాప్ట్ వేర్ ఇంజనీర్ అనూష(26) అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఇద్దరు యువతులు, ఓ యువకుడు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చిన్న గడవెల్లి గ్రామానికి చెందిన అనూష హైదరాబాద్ లో ఓ కార్పోరేట్ కంపనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. అయితే గత వీకెండ్ లో స్నేహితులతో కలిసి సరదాగా గోవాకు విహారయాత్రకు వెళ్లింది. ఓ కారులో అనూష, శైలు, దివిజ, శివ గోవాకు వెళ్లి బుధవారం తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు జహీరాబాద్ శివారులో ప్రమాదానికి గురయ్యింది.
జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి రోడ్డుపక్కన నిలిపిన లారీని వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో ముందుసీట్లో కూర్చున్న అనూష అక్కడికక్కడే మృతిచెందింది. కారు డ్రైవింగ్ చేస్తున్న శివతో పాటు వెనకసీట్లో కూర్చున్న శైలు, దివిజలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం జహీరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న జహీరాబాద్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులోంచి అనూష మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. మృతురాలి తండ్రి సత్యానారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.