Karimnagar Accident: రాజన్న దర్శనానికి వెళ్ళివస్తుండగా ప్రమాదం... 20మందికి గాయాలు
దైవదర్శనం చేసుకుని తెల్లవారుజామున స్వస్థలాలకు బయలుదేరిన కొందరు భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్: సోమవారం తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా (karimnagar district)లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లి తిరిగి స్వస్థలానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి కొందరు భక్తులు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.
వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్, ములుగు జిల్లాలకు చెందిన కొందరు ఓ టాటా ఏస్ (ఆటో) వాహనంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి (vemulavada temple) ఆలయానికి వెళ్లారు. స్వామిదర్శనం, ఇతర కార్యక్రమాలన్ని పూర్తిచేసుకుని సోమవారం తెల్లవారుజామున స్వస్థలాలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న వాహనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామ సమీపానికి రాగానే అదుపుతప్పి ఎదురుగా వేగంగా వస్తున్న కారును ఢీకొట్టింది.
రెండు వాహనాలు మంచి వేగంతో వుండటం... తెల్లవారుజామున మంచు కురవడం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో 15మంది భక్తులు, కారులో ఐదుగురు వున్నారు. వీరిలో కొందరు తీవ్రంగా గాయపడగా మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి వైద్యం అందేలా చూసారు. అనంతరం పాక్షికంగా ధ్వంసమై రోడ్డుకు అడ్డంగా ఆగిపోయిన వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో రోడ్డు ప్రమాదంలో అత్తా అల్లుడు మృతి
వేగంగా వెళుతున్న ఆర్టిసి బస్సు-ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం (road accident) నిజామాబాద్ జిల్లా (nizamabad district) వేల్పూరు మండలంలో చోటుచేసుకుంది.
జగిత్యాల (jagitial) జిల్లా మెట్ పల్లి metpalli)కి చెందిన పోసాని(60), ఆమె అల్లుడు తిరుపతయ్య(40) కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. అయితే గత శనివారం వీరిద్దరు కూరగాయలు కొనేందుకు ఓ ఆటోలో అంకాపూర్ (ankapur) వెళ్లారు. కూరగాయలను ఆటోలో వేసుకుని తీసుకువస్తుండగా వేల్పూరు మండలం లక్కోర గ్రామం వద్దకు రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
వేగంగా వెళుతున్న వీరు ప్రయాణిస్తున్న ఆటోను అంతే వేగంతో వస్తున్న ఆర్టిసి బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటో తుక్కుతుక్కయి అందులో ప్రయాణిస్తున్న అత్తాఅల్లుడు పోసాని, తిరుపతయ్య ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డుప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆటోలో చిక్కుకున్న ఇద్దరి మృతదేహాలను బటయకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమవగా బస్సు ముందుభాగా స్వల్పంగా దెబ్బతింది.