తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో ట్విటర్ వార్ నడుస్తోంది. నిన్న రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. దానికి టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. తాజాగా కవిత ట్వీట్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ : TRS ఎమ్మెల్సీ Kavitha, కాంగ్రెస్ నేతల మధ్య twitter వార్ నడుస్తోంది. తెలంగాణ రైతుల సమస్యలపై కాంగ్రెస్ నేత rahulgandhi చేసిన ట్వీట్కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. దీనిపై స్పందించిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కవిత ట్వీట్ కు సెటైర్ విసిరారు. టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడటం లేదని.. సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఇకపై ఎఫ్సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కెసిఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు అయ్యింది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ, కవిత ట్వీట్స్..
తెలంగాణ రైతు సమస్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘ధాన్యం కొనుగోలు విషయంలో టిఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నంపెట్టే రైతన్నను క్షోభపెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనేవరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుంది’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో రాహుల్కు కౌంటర్ ఇస్తూ…
మీరు ఎంపీ గా ఉండి రాజకీయ లబ్దికోసం ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు.. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హర్యానాకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉంది.. అంటూ కవిత ట్వీట్ చేశారు.
ఇక తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్, బిజెపి నాయకుల మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పోరుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు రాష్ట్రంలోని రైతుల తరపున పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు రాహుల్గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇక, ధాన్యం కొనుగోళ్లపై ఏప్రిల్ నెల అంతా ఉద్యమాలు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం నిర్ణయించింది. ఏప్రిల్ చివరి వారంలో వరంగల్ కేంద్రంగా రైతు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బహిరంగ సభకు ఎంపీ రాహుల్గాంధీని ఆహ్వానించి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని తీర్మానించింది.
