కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బహిరంగ లేఖ రాశారు
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బహిరంగ లేఖ రాశారు. నాలుగేళ్లుగా నిరుద్యోగుల సహనానికి పరీక్ష పెడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మరోసారి స్పష్టమైందని ఆయన అన్నారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం ఉదానీసంగా వ్యవహరించడం వల్ల వేలాది మంది నిరుద్యోగ సోదరులు నష్టపోతున్నారని విమర్శించారు.
వయసు పెరగంతో నియామక పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతున్నారనీ అంటూ తాజాగా చేపట్టిన పోలీసు ఉద్యోగాల నియామాకాల్లో ఆరేళ్లు వయో పరిమితి సడలించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దరఖాస్తుల స్వీకరణకు రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నందున వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. నిరుద్యోగుల పట్ల టీఆర్ఎస్ అలక్ష్యంగా వ్యహరిస్తోందని అన్నారు. వయో పరిమితి సడలింపు డిమాండ్కు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని అన్నారు.
ఇప్పటివరకు విడుదలైన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వివాదాల్లో చిక్కుకోవడం కేసీార్ అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ప్రతి జిల్లాకు పదివేల ఉద్యోగాలు అదనంగా వస్తాయని కేసిఆర్ చెప్పారని, లక్షా ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి మాట తప్పారని ఆయన అన్నారు.