కవితకు మాత్రం ఆప్షన్లు ఇస్తున్నారు.. టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు: రేవంత్ రెడ్డి ఫైర్
టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలోనూ బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతుందని ఆరోపించారు. టీఆరెస్, బీజేపీల వార్ ఒక వీధి నాటకమని విమర్శించారు. రెండు పార్టీ తిట్టుకున్నట్టుగా, కొట్టుకున్నట్టుగా చేసి.. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అందరినీ ఈడీ, సీబీఐలు ఢిల్లీకి పిలిచాయని అన్నారు. కవిత విచారణకు మాత్రం ఆప్షన్లు, అనుమతి కోరుతున్నారని విమర్శించారు. ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోందని అన్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాల వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి రేవంత్ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మీడిమాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే చాలా ఉన్నాయని అన్నారు. కోకాపేట భూములు, ఇతర కేసులపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. గతంలో ఈడీకి ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు స్పందన లేదని అన్నారు. ఢిల్లీలో అయిదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని చెప్పారు. డిసెంబర్ 6వ తేదీ లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా పోతుందన్నారు.