కేసీఆర్... నీ సుట్టం కోసమే కొత్త చట్టమా? రేవంత్ రెడ్డి ఫైర్
- కేసీఆర్ బూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ రేవంత్ ఫైర్
- మై హోమ్ రామేశ్వర్ రావుతో కుమ్మక్కై భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు
- నయూమ్ ఎన్ కౌంటర్ వెనుక కూడా చీకటి కోణం వుందన్న రేవంత్
రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగనంత అతిపెద్ద భూకుంభకోణానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావులు పాల్పడుతున్నారని కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ.. అసైన్ మెంట్ ల్యాండ్స్ పై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే హడావిడిగా అసెంబ్లీ సమావేశాన్ని ముగించారని తెలిపారు. లబ్ది దారులకు మేలు చేస్తున్నామన్న ముసుగులో ఆర్డినెన్స్ తేవాలని చూస్తున్నారని చెప్పారు. అసైన్మెంట్ ఆర్డినెన్స్ వెనక కేసీఆర్ కుటుంబం వేల కోట్ల భూదందాకు తెరలేపిందన్నారు.
కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే తన ఆరోపణలపై స్పందించాలని సవాల్ విసిరారు. ఈ స్కాంలో కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వర్ రావ్ ఉన్నారని, శంషాబాద్, మహేశ్వరం పరిసరాల్లో నాలుగు వేల ఎకరాల భూమి జూపల్లి చేతిలో ఉన్నాయని వెల్లడించారు. హెచ్ఎండీఏ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ రెగ్యులరైజ్ వ్యతిరేకించినందుకే బీఆర్ మీనాను బదిలీ చేశారని విమర్శించారు. రామేశ్వర్ రావుకు , మేలు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. శంషాబాద్ ,మహేశ్వరం మండలంలో రామేశ్వర్ రావుకు భూములెన్ని ఉన్నాయో, వాటిలో అసైన్ లాండ్ ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పాలని సూటిగా అడిగారు.
కేసీఆర్ తన చుట్టం జూపల్లి కోసం..చట్టం తేవాలని చూస్తున్నారని అన్నారు. సీఎం, సీఎం బంధువులపై తాను ఆరోపణలు చేస్తున్నానని, దైర్యం ఉంటే తనపై కేసులు పెట్టుకోవచ్చునని అన్నారు. నయీమ్ ఎన్కౌంటర్ వెనక, ఈ భూమికి సంబంధించిన చీకటి కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం భూ దందా పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనను రెచ్చగొట్టేందుకు తిట్ల కోసం కాకుండా..తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ నేతలను సూటిగా అడిగారు. నిషేధించిన చట్టాన్ని మార్చాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.