జీవో 317 అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తాం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణలో జీవో నెంబర్ 317కు (GO 317) వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగ బదిలీపై తీవ్ర మనస్థాపం చెంది ఇటీవల గుండెపోటుతో మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ కుటుంబ సభ్యులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు.
తెలంగాణలో జీవో నెంబర్ 317కు (GO 317) వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగ బదిలీపై తీవ్ర మనస్థాపం చెందిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. జైత్రం నాయక్ కుటుంబాన్ని నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. జీవో 317 కు వ్యతిరేకంగా తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాక్షస పాలన నడుస్తుందని అన్నారు. జీవో నెం.317ని వెంటే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులోనూ (parliament) దీనిపై పోరాటం చేస్తామని చెప్పారు.
‘కేసీఆర్ ఓట్లేసిన ప్రజలను కాకుండా పోలీసులను నమ్ముకుని పరిపాలన చేస్తున్నారు. న్యాయం కోసం అడిగేవాళ్లను పోలీసుల చేత నిర్భంధించి, ఒత్తిడి చేసి సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల పిల్లలు ఈ రోజు ఎక్కడుండాలో, వాళ్ల స్థానికత ఏమిటో తెలియని గందరగోళ పరిస్థితిని కేసీఆర్ సృష్టించారు. సమస్యను జఠిలం చేసి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూస్తుంది. దీనిని క్షమించకూడదు. ఈ అంశాన్ని రాష్ట్రంలో శాసనసభలో, కేంద్రంలో పార్లమెంట్లో తమ పార్టీ ప్రశ్నిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేసి వ్యవహరిస్తున్నాయి’ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అనంతరం పర్వతగిరిలో రేవంత్ రెడ్డి పర్యటించారు. పంట నష్టం, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన మిరప రైతు సంపత్ కుటుంటాన్ని రేవంత్ పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ. 25 వేలు ఆర్థిక సాయం చేశారు.