తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారిద్దరి భేటికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారిద్దరి భేటికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే.. కేసీఆర్ను కలిశారని అన్నారు. ఇకపై ప్రశాంత్ కిషోర్కు టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చారు. ఐప్యాక్తో కూడా పీకేకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు.
పీకే కాంగ్రెస్లో చేరాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి.. తనతో కలిసి ఉమ్మడి ప్రెస్మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. అప్పుడు పీకే నోటి నుంచి టీఆర్ఎస్ను ఓడించండని చెప్పడం వింటారని అన్నారు. పీకే కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన అధిష్టానం మాటే ఫైనల్ అని అన్నారు.
ఇక, ఓడిపోతామనే భయంతోనే సీఎం కేసీఆర్ వ్యుహాకర్తను పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎవరితో పొత్తు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. మే 6వ తేదీన వరంగల్లో జరిగే సభలో రాహుల్ గాంధీ ఇదే అంశంపై స్పష్టత ఇస్తారని అన్నారు. మరోవైపు పీకే, కేసీఆర్ భేటీపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పరోక్షంగా ట్వీట్లు చేశారు. శత్రువుతో స్నేహం చేసేవారిని నమ్మొద్దని అన్నారు.
మరోవైపు ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలను అంగీకరించాలా..? వద్దా.? అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు సమావేశమైంది. కిషోర్ సమర్పించిన ప్రతిపాదనపై చర్చించడానికి ఢిల్లీలోని 10 జనపథ్లోని సోనియా గాంధీ నివాసంలో.. ఆమెతో ఏడుగురు సభ్యుల కమిటీ సమావేశం అయింది. ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, అంబికా సోనీ, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా ఉన్నారు. రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేత ఎకె ఆంటోనీ కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ను పార్టీలోకి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలపై నేతలు చర్చిస్తున్నారు. అలాగే పార్టీలోకి తీసుకుంటే ఏ విధమైన బాధ్యతలు అప్పగించాలనే అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ విషయంలో ఇప్పటికే గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.
ఇప్పటికే సోనియా గాంధీతో పలుమార్లు సమావేశమైన ప్రశాంత్ కిషోర్.. గత కొంతకాలంగా వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయడానికి తన ప్రణాళికపై వివరణాత్మక ప్రదర్శనలు ఇచ్చాడు.అయితే.. కాంగ్రెస్కు ప్రత్యర్థులుగా ఉన్న కొన్ని పార్టీలతో పీకే పనిచేస్తున్న కారణంగా కాంగ్రెస్ సీనియర్లలో ఒక విభాగం ఆయన చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
