Regional Ring Road: జోరందుకున్న RRR.. ఆ పనులకు మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
RRR: హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు(RRR) పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని, అడ్డంకులన్నీ అధిగమించి, ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
![Revanth Reddy Ordered To Complete Tenders For Regional Ring Road Works Within Three Months KRJ Revanth Reddy Ordered To Complete Tenders For Regional Ring Road Works Within Three Months KRJ](https://static-ai.asianetnews.com/images/01hkte1bft7z4yarj48fb9pp96/untitled-design--51--png_363x203xt.jpg)
RRR: హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను సూచించారు. నిలిచిపోయిన భూసేకరణను రాబోయే మూడు నెలలలో పూర్తి చేయాలని, భూసేకరణతో పాటే ఆర్ఆర్ఆర్ (ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది.
భారత్ మాల పరియోజన ఫేజ్ వన్ లో రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తరం) 158.645 కిలోమీటర్ల మేరకు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1459.28 హెక్టార్ల భూమిని సేకరించారు.
గత ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి కారణంగా తొమ్మిది నెలలుగా ఈ ప్రాజెక్టు (భూసేకరణ)లో ఎటువంటి పురోగతి లేదనీ, నేషనల్ హైవే అథారిటీ (NHAI) తో తలెత్తిన చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నం జరగలేదని తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనీ, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని తెలిపారు.
అలాగే.. ఆర్ఆర్ఆర్ (దక్షిణం) భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తరువాత భూ సేకరణకు ప్రణాళికను రూపొందించాలని నేషనల్ హైవే అథారిటీని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ఏ కార్యానైనా నిర్వహించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించేందుకు ప్రభుత్వం సిద్దమైన విషయం తెలిసిందే. అవుటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవశ్యాన్ని సీఎం అధికారులతో చర్చించారు. ఈ రహదారి పూర్తయితే.. రవాణా సదుపాయాలతో సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు.