రాజ్ భవన్ లో  కాంగ్రెస్ పార్టీ  నేతలు  బుధవారం నాడు  సమావేశమయ్యారు. ప్రశ్నాపత్రం లీక్  కేసులో  కాంగ్రెస్ నేతలు  గవర్నర్ కు అప్లికేషన్ పెట్టుకున్నారు.

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ ను భర్తరఫ్ చేసేందుకు అనుమతివ్వాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కోరినట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.

 రాజ్ భవన్ లో గవర్నర్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారంనాడు భేటీ అయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత రాజ్ భవన్ బయట రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

పేపర్ లీక్ అంశం కేటీఆర్ శాఖ వ్యవహరమని ఆయన చెప్పారు. కంప్యూటర్ల నిర్వహణ, ఐటీ శాఖ కిందకు వస్తుందన్నారు.. కంప్యూటర్లలో నిక్షిప్తమైన క్వశ్చన్ పేపర్లు దొంగిలిండచం ఐటీ శాఖ పరిధిలోకి వస్తుందన్నారు. టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నాపత్రం లీక్ అంశానికి కేటీఆర్ బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక శాఖలో అవినీతి జరిగినప్పుడు ఆ శాఖ మంత్రి బాధ్యత వహించాలన్నారు. టీఎస్‌పీఎస్‌సీలో పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ పార్టీ అనేక రూపాల్లో ఆందోళనలు నిర్వహించిందన్నారు.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంలో కేటీఆర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని గవర్నర్ కు ధరఖాస్తు పెట్టుకున్నామన్నారు. గతంలో మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం ఉదంతాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను గవర్నర్ కు అందించామన్నారు.సిట్ పై నమ్మకం లేదన్నారు. తమ ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుంటామని గవర్నర్ చెప్పారన్నారు. పేపర్ లీక్ కేసుపై పారదర్శకమైన విచారణ జరగాలని కోరామన్నారు.

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: పెన్ డ్రైవ్‌ ల్లో క్వశ్చన్ పేపర్లు,మరో 10 మందికి నోటీసులు

పేపర్ లీక్ అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్, టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ లను ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా అనుమతివ్వాలని గవర్నర్ ను కోరామన్నారు. తనకున్న అధికారాలతో టీఎస్‌పీఎస్‌సీ పాలకవర్గాన్ని సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి గవర్నర్ ను కోరారు.