కేసీఆర్ ప్రాణాలకు ముప్పు: కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. కేసీఆర్ పై మెత్త పెట్టి కేటీఆర్ ఒత్తాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై తెలంగాణ కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ అర్థరాత్రి లేచి తండ్రి కేసీఆర్ ను మెత్త పెట్టి ఒత్తిండని ఆయన ఆరోపించారు.
ఇటీవలి వార్తలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
హైదరాబాదులోని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెసులో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి శనివారం కర్మన్ ఘాటులో మాట్లాడారు. పదవి కుటుంబ సభ్యుల మధ్య కూడా చిచ్చు పెడుతుందని ఆయన అన్నారు.
తనను ముఖ్యమంత్రిని చేయకపోతే అర్థరాత్రి లేచి తండ్రిని మెత్త పెట్టి కేటీఆర్ ఒత్తాడని, దాన్ని బట్టి ఏదైనా జరగరానిది జరగవచ్చునని ఆయన అన్నారు. కేటీఆర్ ను ప్రగతిభవన్ నుంచి ఖాళీ చేయించాలని ఆయన అన్నారు.