ఒకే వేదికపై రేవంత్, కోమటిరెడ్డి.. నవ్వుతూ మాట్లాడుకున్నారు.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్..
కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి (Revanth reddy), కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు (komatireddy venkat reddy) ఒకే ఫ్రేమ్లో కనిపించడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. ఇందుకు ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్ష (Telangana Congress Vari Deeksha) వేదికగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా రేవంత్ రెడ్డికి (Revanth reddy) బాధ్యతలు అప్పగించడంపై ఆ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy venkat reddy)బహిరంగంగానే వ్యతిరేకించిన సంగతి తెలిసందే. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో రేవంత్పై విమర్శలు కూడా చేశారు. అయితే తాజాగా చోటుచేసుకున్న ఓ పరిణామం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు ఒకే ఫ్రేమ్లో కనిపించడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. ఇందుకు ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్ష (Telangana Congress Vari Deeksha) వేదికగా మారింది.
ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ‘కర్షకుల కోసం కాంగ్రెస్’ అంటూ ఇందిరా పార్క్ వద్ద నేడు కాంగ్రెస్ వరి దీక్షలకు దిగింది. ఈ దీక్షకు హాజరైన కోమటిరెడ్డి.. అక్కడే ఉన్న రేవంత్ ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. ఇద్దరు ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి నవ్వుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని చూసిన కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న కాంగ్రెస్ అభిమానులు.. తెగ సంబరపడిపోతున్నారు.
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల తరువాత నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ కాంగ్రెస్ నేతలందరికీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. నేతల మధ్య విభేదాలు మంచివి కావని గట్టిగానే చెప్పారు.
ఈ క్రమంలోనే సీనియర్ నేత వీహెచ్.. కోమటిరెడ్డితో మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజా మార్పు చోటుచేసుకున్నట్టుగా చెబుతున్నారు. అయితే వీరిద్దరు నిజంగానే కలిసి ముందుకు సాగుతారా..?, లేక పార్టీ ఆదేశాలతో ఇలా కనిపించారా..? అనేది భవిష్యత్తులో తేలనుంది.