టిన్యూస్ సంతోష్ ను ఇసుక వివాదంలోకి గుంజిన రేవంత్
- టిన్యూస్ సంతోష్ లారీలు పదిమందిని బలితీసుకున్నాయి
- కడుపు మండిన దళితులపై కేసులు పెడతారా?
- సిఎం కెసిఆర్ దుర్యోధనుడిలా అహంకారంతో మాట్లాడుతున్నారు
- రేపు నేరెళ్ల వెళ్లి బాదితులను పరామర్శిస్తా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఇసుక మాఫియా దందాలపై తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి కొత్త పేరును తెరమీదకు తెచ్చారు. ఈ దందాల్లో టీ న్యూస్ ఎండీ సంతోష్ రావు హస్తం ఉన్నట్లు ఆరోపించారు రేవంత్. సంతోష్ రావు ఇసుక దందాలపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. సంతోష్ తెలంగాణ వ్యాప్తంగా ఇసుక దందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా టీఆర్ ఎస్ ప్రభుత్వం పట్టించుకొవడం లేదన్నారు.
సంతోష్ లారీల కింద పడి 10 మంది దళితులు మరణించారని సంచలన ఆరోపనలు చేశారు రేవంత్ రెడ్డి. సంతోష్ ఇసుక లారీల కింద పడి 10మంది దళితులు చనిపోతే అది వదిలేసి ఆవేశంలో దళితులు తిరగబడితే అక్రమ కేసులు బనాయించి హింసించడం సరికాదన్నారు. అయినప్పటికీ సంతోష్ మీద ఎందుకు అధికారులు నోరు మెదపడం లేదని ప్రశ్నించాడు. దళితులు తమ పై జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టి హింసించారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు రేవంత్. కెసిఆర్ దుర్యోధనుడిని మించిన అహాంకారంలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష రాజకీయ నేతలను కించపరిచి మాట్లాడటం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అన్నారు. కమ్యూనిస్టులను కేసీఆర్ దుర్భాషలాడడం చాలా నీచమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నా ఆయన కనీసం స్పందించడం లేదన్నారు. దళితుల మెడలో బోర్డ్ లు ఉంటాయా అని కెసిఆర్ మాట్లాడటం చాలా దారుణం అన్నారు. నేరెళ్లలో దళితులపై దాడి జరిగిన నేపథ్యంలో రేపు నేరెళ్లలో పర్యటిస్తానని రేవంత్ ప్రకటించారు.