తెలంగాణ లోకాయుక్తగా రిటైర్డ్ జడ్జి రాములు ప్రమాణం
తెలంగాణ లోకాయుక్తగా రాములు సోమవారం నాడు ప్రమాణం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ లోకాయుక్తగా రిటైర్డ్ జస్టిస్ రాములు సోమవారం నాడు రాజ్భవన్లో ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.
రాజ్ భవన్లో సోమవారం నాడు సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో లోకాయుక్తగా జస్టిస్ రాములుతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఉపలోకాయుక్తగా నిరంజన్రావుతో కూడ గవర్నర్ ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కమిటీ తెలంగాణ లోకాయుక్త గా రిటైర్డ్ జస్టిస్ రాములు, ఉప లోకాయుక్తగా నిరంజన్ రావు పేర్లను ఇటీవల ఖరారు చేసింది.
ఈ కమిటీలో శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు ఈ కమిటీలో ఉన్నారు.
లోకాయుక్తగా నియమితులైన రిటైర్డ్ జడ్జి రాములు, ఉపలోకాయుక్త నిరంజన్ రావులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.1949 ఫిబ్రవరి 20వ తేదీన సీవీ రాములు జన్మించారు. నిజామాబాద్ జిల్లా అచనపల్లి గ్రామానికి చెందినవాడు రాములు. బోధన్ సమీపంలోని శంకర్నగర్కు చెందిన ప్రభుత్వ బాలుర హైస్కూల్లో ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.
నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తి చేశాడు. ఔరంగబాద్ లోని మరట్వాడా యూనివర్శిటీలో లా పూర్తి చేశాడు రాములు. 1978 ఆగష్టు 10వ తేదీన ఆయన న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాడు. 24 ఏళ్లుగా ఉమ్మడి ఏపీ హైకోర్టులో రాములు ప్రాక్టీస్ చేశాడు.