తెలంగాణ రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic Day Celebration) నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

తెలంగాణ రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic Day Celebration) నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘గణతంత్ర దినోత్సవ స్పూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది. అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళి అర్పిస్తున్నాను. కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే మనదేశం ముందున్నందుకు గర్వంగా ఉంది. త్వరలో 200 డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేసుకోబోతున్నాం. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఎదగడం సంతోషకరం. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగింది. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృతజ్ణతలు’ అని పేర్కొన్నారు. 

అంతకు ముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని వార్ మెమోరియల్ (వీరుల సైనిక్ స్మారక్) వద్దకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు. 

ఇక, ప్రతి ఏడాది పబ్లిక్ గార్డెన్స్​లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆ వేదికను రాజ్​భవన్​కు మార్చారు. కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.