Telangana: తెలంగాణ సీఎం-గవర్నర్ మధ్య దూరం పెరుగుతోందా?
Telangana: తెలంగాణలో గత కొన్ని రోజులుగా రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో గులాబీ బాస్ వేస్తున్న అడుగులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం-గవర్నర్ మధ్య దూరం పెరుగుతోందా? అనే చర్చ మొదలైంది. దీనికి స్పష్టమైన సమాధానం రాకపోయినా.. అవునే రాజకీయా వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి బుధవారం జరిగిన గణతంత్ర వేడుకలు మరింత బలం చేకూరుస్తున్నాయి.
Telangana: తెలంగాణలో గత కొన్ని రోజులుగా రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో గులాబీ బాస్ వేస్తున్న అడుగులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం-గవర్నర్ మధ్య దూరం పెరుగుతోందా? అనే చర్చ మొదలైంది. దీనికి స్పష్టమైన సమాధానం రాకపోయినా.. అవునే రాజకీయా వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి బుధవారం జరిగిన గణతంత్ర వేడుకలు మరింత బలం చేకూరుస్తున్నాయి. గవర్నర్-ముఖ్యమంత్రికి దూరం పెరుగుతున్నదనే విషయాన్ని స్పష్టం చేసే విధంగా రిపబ్లిక్ డే లో ఏం జరిగిందనే దానితో పాటు అనేక అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
గత కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. అయితే, రాజ్ భవన్, సీఎం కార్యాలయం మధ్య దూరం పెరుగుతున్నదని రాజకీయాల్లో చర్చ జరగడానికి రిపబ్లిక్ డే వేడుకలు కేంద్ర బిందువుగా మారాయి. ఎందుకంటే బుధవారం రాజ్భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. అలాగే, రాష్ట్ర మంత్రులు కూడా ఎవరూ హాజరు కాలేదు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలతో, ఆ పార్టీ నియమించిన గవర్నర్తో దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి కారణం గవర్నర్ తమిళిసై ఇటీవల రాష్ట్ర ప్రగతిని కాకుండా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించడమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి తోడు ఇటీవల రాజ్భవన్లో రెండు ఫిర్యాదుల బాక్సులను కూడా తమిళి సై సౌందరరాజన్ ఏర్పాటు చేశారు. ఇది సీఎం కేసీఆర్ సర్కారుకు నచ్చలేదని రాజకీయాల్లోని ఓ వర్గం పేర్కొంటోంది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్ర కమలం నేతలు కేసీఆర్ సర్కారును టార్గెట్ చేయడంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే కావాలనే బీజేపీ నేతలతో పాటు, కమలం పార్టీ సర్కారు నియమించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు దూరం ఉంటున్నారని రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ప్రసంగం పైన కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే రిపబ్లిక్ డే రోజు నాడు గవర్నర్ చదివిన ప్రసంగం కాపీని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించలేదని, గవర్నరే స్వయంగా తయారు చేసుకుని చదివారని మాట్లాడుకుంటున్నారు. అయితే, మొత్తంగా బీజేపీతో పెరిగిన విభేధాల కారణంగా గవర్నర్ తో అంటిముట్టనంటూ సీఎం ఉంటున్నారని చర్చ నడుస్తోంది. రాజ్భవన్ రిపబ్లిక్ డే కు సీఎంతో పాటు ఇతర మంత్రులు కూడా హాజరు కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ది అంశాలతో పాటు ప్రధాని మోడీ చేస్తున్న పనులను గురించి ప్రశంసలు కురించారు. రెండుమూడు సార్లు మోడీ పేరును ప్రస్తావించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని విమర్శలు చేస్తుండగా.. గవర్నర్ పొగడ్తలు కూడా చర్చకు దారి తీస్తున్నాయి.
మరోవర్గం మరోరకమైన వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగానే సీఎం కేసీఆర్ రాజ్భవన్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనలేదని పేర్కొంటున్నాయి. దీనికి అంతకు మందు ఏడాది కరోనా విజృంభణ అధికంగా ఉన్న సమయంలో రాని అడ్డంకులు ఇప్పుడు ఎందుకు వచ్చాయనే ప్రశ్నలు లేకపోలేదు. ప్రగతి భవన్కు రాజ్ భవన్ కు పెద్ద దూరం లేని విషయాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. మొత్తంగా ఇటు గవర్నర్ అటు ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్న తీరు గమనిస్తే.. రాజ్భవన్-సీఎంవో మధ్య దూరం పెరుగుతున్నదనే తెలుస్తోంది. అయితే, మున్ముందు ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి మరి !