రేగా కాంతారావుకు షాక్: రెడ్డిగూడెంలో అడ్డుకొన్న గ్రామస్తులు
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసనలు ఎదురౌతున్నాయి.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసనలు ఎదురౌతున్నాయి.ఆదివారం నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం కోసం వెళ్లిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును రెడ్డిగూడెం గ్రామస్తులు నిలదీశారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచారం కోసం బూర్గుంపహాడ్ మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి వెళ్లారు. ప్రచారం చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే రేగా కాంతారావును గ్రామస్తులు నిలదీశారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేయాలని కోరారని...ఇప్పుడేమో టీఆర్ఎస్కు ఓటేయాలని ఎందుకు కోరుతున్నారని గ్రామస్థులు నిలదీశారు.
పార్టీ ఎందుకు మారారని రేగా కాంతారావును గ్రామస్థులు నిలదీశారు. అంతేకాదు ఈ గ్రామానికి మీరేం చేశారని కూడ ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. అయితే ఈ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్థులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
దీంతో ఎమ్మెల్యే అనుచరులతో గ్రామస్థులు వాగ్వావాదానికి దిగారు. గ్రామానికి చెందిన పెద్దలు కూడ కాంతారావును నిలదీశారు. గ్రామస్తుల నుండి తీవ్ర నిరసన ఎదురుకావడం... పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చేసేది లేక రేగా కాంతారావు గ్రామాన్ని వీడి వెళ్లారు.
శనివారం నాడు ఇదే జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్పై ఓ గ్రామంలో దాడికి కూడ దిగారు. పార్టీ మారడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.