కంటతడి పెట్టిస్తున్న ఫలితం.. పరీక్షలు ముగిశాక ఇంటికి వస్తుండగా ప్రమాదంలో మృతి.. కానీ ఫలితాల్లో కాలేజ్ టాపర్..
పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కష్టపడి చదివింది ఆ అమ్మాయి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ పరీక్షలు ముగిసిన తర్వాత తండ్రితో కలిసి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. అయితే నిన్న వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మృతిచెందిన ఆ అమ్మాయే కాలేజ్ టాపర్గా నిలిచింది.
పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కష్టపడి చదివింది ఆ అమ్మాయి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. పరీక్షలు బాగానే రాశానని స్నేహితురాళ్లతో, టీచర్స్తో చెప్పింది. పరీక్షలు ముగియడంతో తండ్రితో కలిసి ఇంటికి బయలుదేరింది. అయితే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటనలో అమ్మాయితో పాటు ఆమె తండ్రి మృతిచెందారు. కట్ చేస్తే.. నిన్న వెల్లడైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తాను చదువుతున్న కాలేజ్ టాపర్గా నిలిచింది. అంతా ప్రతిభ కలిగిన విద్యార్థి.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని గుర్తుచేసుకుని అటు కుటుంబ సభ్యులు, ఇటు టీచర్స్, స్నేహితురాళ్లు బాధపడుతున్నారు. ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాలు.. ఇటిక్యాల మండలం మునగాలకి చెందిన నల్లన్న, పద్మమ్మ దంపతులకు కూతురు రాజేశ్వరి. రాజేశ్వరి గద్వాల మండలంలోని గొనుపాడు కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ చదివింది. మే 19న సెకండ్ ఈయర్ పరీక్షలు పూర్తికావడంతో.. స్నేహితురాళ్లు, టీచర్లతో సరదాగా మాట్లాడి.. తర్వాత కలుద్దామని వారికి బై చెప్పి తండ్రితో కలిసి బైక్పై ఇంటికి బయలుదేరింది.
అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే రాజేశ్వరి, ఆమె తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆర్టీసీ బస్సు వీరి బైక్ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాజేశ్వరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇక, తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కాగా.. అందులో రాజేశ్వరి 867 మార్క్లు సాధించినట్టుగా తేలింది. ఆమె చదివిన కస్తూర్బాగాంధీ కాలేజ్లో ఎంపీసీ విభాగంలో కాలేజ్ టాపర్గా చెప్పింది. తాను చెప్పినట్టుగా మంచి మార్కులు సాధించిన రాజేశ్వరి.. ప్రస్తతుం తమ మధ్య లేకపోవడం బాధకరమని కాలేజ్ ఉపాధ్యాయులు, స్నేహితురాళ్లు విచారం వ్యక్తం చేశారు. రాజేశ్వరి చదువుల్లో చురుకుగా ఉండేందని.. బతికి ఉంటే ఈ ఫలితాలను చూసి సంబరపడిపోయేదని ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.