హైద్రాబాద్ను ముంచెత్తిన వర్షం: నీట మునిగిన కాలనీలు
హైద్రాబాద్ నగరాన్ని వర్షం నీరు ముంచెత్తింది. గత ఏడాది కురిసిన వర్షంతో నగరాన్ని అతలాకుతలం చేసింది. బుధవారం నాడు కురిసిన వర్షాలకు నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో బుధవారం నాడు సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు వర్షాలు కురిశాయి. హైద్రాబాద్ లో బుధవారం నాడు రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
హైద్రాబాద్ ఉప్పల్ లో 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. హయత్నగర్ లో 19.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. సరూర్నగర్ లో 17 సెం.మీ. వర్షపాతం నమైదైంది. సరూర్ నగర్ చెరువు కింద లోతట్టు ప్రాంతాల్లో 24 కాలనీల్లో సుమారు 14 కాలనీలు నీటిలో మునిగాయి. సరూర్ నగర్ చెరువుకు సమీపంలో ఉన్న కోదండరామానగర్, చైతన్యపురి, వివేకానందనగర్ తదిరత కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి.
సరూర్ నగర్ చెరువు నుండి వదలిన నీరు నాలా గుండా మూసీలో కలుస్తోంది. భారీ వర్షం కారణంగా సరూర్ నగర్ చెరువు నుండి వదలిన నీరు నాలాను దాటి సమీపంలోని ఇండ్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు ప్రవహించింది. ఇండ్లలో వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి.
ఎల్బీనగర్, హైదర్ నగర్, బడంగేట్ తపోవన్ కాలనీ, వనస్థలిపురంలోని పలు కాలనీలు నీట మునిగాయి.ఉప్పల్ ఏరియాలోని పలు కాలనీలు కూడ నీట మునిగాయి.గత ఏడాదిలో కురిసన భారీ వర్షాల కారణంగా హైద్రాబాద్ అతలాకుతలమైంది. ఈ ఏడాది జూలై మాసంలో ఒక్క రోజులో కురిసిన భారీ వర్షాలకు మరోసారి ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది.ఇక హయత్నగర్ బస్ డిపోలో వర్షపు నీరు చేరింది. వర్షపు నీటిలోనే బస్ డిపో పెట్రోల్ బంకు మునిగిపోయింది. గత ఏడాదిలో కురిసిన వర్షానికి కూడ హయత్ నగర్ బస్ డిపో మునిగిపోయిన విషయం తెలిసిందే.