కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతుంది. పాదయాత్ర మార్గంలో ప్రఖ్యాత చార్మినార్ను రాహుల్ గాంధీ సందర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్లోకి ప్రవేశించింది. లంచ్ బ్రేక్ తర్వాత పురానాపూల్ నుంచి రాహుల్ పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. పాదయాత్ర మార్గంలో ప్రఖ్యాత చార్మినార్ను రాహుల్ గాంధీ సందర్శించారు. చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాహుల్ పాదయాత్రలో భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. చార్మినార్ నుంచి ఎంజే మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, ఏజీ ఆఫీస్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా రాహుల్ పాదయాత్ర నెక్లెస్ రోడ్డుకి చేరుకోనుంది.
నెక్లెస్ రోడ్డులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి రాహుల్ గాంధీ నివాళులర్పించనున్నారు. అక్కడే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాహుల్ పాదయాత్రలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు రావడం ఇదే తొలిసారి. ఇక, రాహుల్ పాదయాత్ర సాగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఇక, మంగళవారం రాత్రి బోయినపల్లిలోని రాజీవ్గాంధీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. భారత్ జోడో యాత్ర 55వ రోజు ప్రత్యేకమనైదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. 1990 అక్టోబర్ 19న రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ప్రారంభించిన చార్మినార్ నుంచి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేశారని వారు తెలిపారు.
