తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గాంధీ భవన్‌కు చేరుకున్నారు. గాంధీ భవన్‌కు చేరుకున్న రాహుల్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. 

తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గాంధీ భవన్‌కు చేరుకున్నారు. గాంధీ భవన్‌కు చేరుకున్న రాహుల్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.  హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు రాహుల్ రావడం ఇదే తొలిసారి. గాంధీ భవన్‌ చేరుకోగానే రాహుల్‌కు వేద పండితులు ఆశ్వీరచనం అందజేశారు. ఇక, గాంధీ భవన్‌లో పార్టీ నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీ పార్టీ నాయకుల అభిప్రాయాలను రాహుల్ గాంధీ తీసుకోనున్నారు. పార్టీ సభ్యత్వ సమన్వయకర్తలతో ఫోటోలు దిగుతారు. ఈ  కార్య‌క్ర‌మం అనంత‌రం గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీ బయలుదేరుతారు. దీంతో రాహుల్ గాంధీ రెండు రోజు తెలంగాణ పర్యటన ముగియనుంది. 

ఇక, నిన్న వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రాహుల్ బస చేశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన అల్పాహారం చేశారు. అనంతరం పలు మీడియా సంస్థల అధిపతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో హోటల్‌లోనే ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చెరుకు సుధాకర్, కంచె ఐలయ్య, గద్దర్, హరగోపాల్‌లతో విడివిడిగా రాహుల్ భేటీ అయ్యారు. 

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి.. సంజీవయ్య పార్క్‌కు చేరుకున్నారు. అక్కడ దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు చేరుకని.. ఎన్‌ఎస్‌యూఐ నాయకులను పరామర్శించారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో సహా 18 మంది నాయకులను రాహుల్ గాంధీతో ములాఖత్ అయ్యారు. రాహుల్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్‌ఎస్‌యూఐ నాయకుల వద్దకు వెళ్లారు. చంచల్‌గూల్ జైలులో రాహుల్‌తో పాటు ఒక్కరు మాత్రమే ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో ములాఖత్ అయ్యేందుకు అధికారులు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేవలం భట్టి విక్రమార్క ఒక్కరే రాహుల్‌తో వెళ్లారు. 

ఇక, రాహుల్ రాక నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు సాధారణ ములఖాత్‌లు నిలిపివేశారు. మరోవైపు రాహుల్ చంచల్‌గూడ జైలుకు వస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.