కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు(అక్టోబర్ 23) తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి తెలంగాణలోని ఎంటర్ అయింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు(అక్టోబర్ 23) తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోకి ఎంటర్ అయింది. ఈరోజు తెల్లవారుజామున కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని ఎర్మారస్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ.. నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్ పోస్టు వద్ద తెలంగాణలోకి అడుగుపెట్టారు. కర్ణాటక నుంచి తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించిన సమయంలో.. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండాను తీసుకున్నారు.
తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి.. మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఇతర పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మ, బోనాలు, డోలు వాయిద్యాలతో రాహుల్కు తెలంగాణలోకి స్వాగతం చెప్పారు. అక్కడి నుంచి మూడు కి.మీల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగించనున్నారు. తర్వాత పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. అనంతరం రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
దీపావళి పండగ, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారోత్సం సందర్భంగా ఈ నెల 24,25,26 తేదీల్లో రాహుల్ పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఈ నెల 26వ తేదీ రాత్రికి తిరిగి రాహుల్ తెలంగాణ చేరుకుంటారు. అక్టోబరు 27న ఉదయం గూడెంబెల్లూరు నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.
ఇక, తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 12 రోజుల్లో 375 కిలోమీటర్ల మేర గాంధీ పాదయాత్ర చేయనున్నారు. నవంబర్ 4న ఒకరోజు సాధారణ విరామం ఉండనుంది. నవంబర్ 7న రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. అయితే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో కంటే.. తెలంగాణలో రాహుల్ యాత్రను సూపర్ సక్సెస్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో భారీ బహిరంగ సభకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే.. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో రాహుల్ పూజలు నిర్వహించేలా పార్టీ ప్రణాళిక రూపొందింది. యాత్ర మార్గంలోని పలు దేవాలయాలు, మసీదులను కూడా రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్రను సమన్వయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
